Komram Bheem- A Festival & Struggle of Adivasis అక్టోబర్ 26, 2007
Posted by Telangana Utsav in Gond, Telangana Festivals, Telangana People, Telugu (తెలుగు).trackback
కొమరం-సమరం
- నూర శ్రీనివాస్
జల్-జంగల్-జమీన్. ఆదిలాబాద్లోని గోండు గిరిజనులకే కాదు రాష్ట్రంలోని ఆదివాసీలందరి నినాదం. నిజాం విధానాలకు, జంగ్లాతు (అటవీ) అధికారుల
దుర్మార్గాలకు నిరసనగా అనేక ఉద్యమాలు జరిగాయి. 1920 నాటి అటవీ చట్టం మొదలు 2005 నాటి అటవీ చట్టం దాకా గిరిజనులు మోసపోతూనే ఉన్నారు.
గోండుల ఆరాధ్య వీరుడు కొమురం భీం నిజాం విధానాలకు వ్యతిరేకంగా తన జాతిని ఏకంచేసి, ఆదివాసుల ప్రత్యేక ప్రతిపత్తికోసం పోరాడిన ధీరుడు. 12 గ్రామాల్లోని గోండుల్ని సమీకరించి పోరాటం సాగించి అసువులు బాసిన స్థలంలో (కెరమెరి మండలంలోని జోడేఘాట్) ప్రతీయేటా సంస్మరణ సభ జరుగుతుంది.
జాతరను తలపించే రీతిలో సాగే ఈ సంస్మరణ సభను అటు ప్రభుత్వమూ, ఇటు రాజకీయపార్టీలూ తమకు అనుకూలంగా వినియోగించుకుంటాయి. గిరిజనుల సమస్యల్ని పరిష్కరించే వేదికగా జోడేఘాట్లో ఐటిడిఎ దర్బారు నిర్వహిస్తోంది.
భీం వర్ధంతి వేడుకల వేదిక ఎక్కేందుకు రాజకీయ పార్టీలు పోటీలు పడతాయి. కానీ భీం కాలం నాటి పరిస్థితులే ఇంకా గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. కొమురం భీం పోరాటం నుంచి ఇవ్వాళ్టి కమ్యూనిస్టుల పోరాటం దాకా సమస్యంతా భూమి చుట్టే తిరుగుతోండటం భూ సమస్య తీవ్రతకు నిదర్శనం. భీం మరణం తరువాత అప్పటి నిజాం ప్రభుత్వం భూ సమస్య తీవ్రతను గుర్తించి గిరిజనుల స్థితిగతుల్ని అధ్యయనం చేసేందుకు హేమండార్ఫ్ను పంపించింది.
డార్ఫ్ ప్రతిపాదించిన మార్గదర్శకాలు వీసమెత్తు కూడా అమలుకు నోచుకోలేదనే చరిత్ర చెబుతోన్న సత్యం. అటవీ ఉత్పత్తులు, అటవీ భూములే ఆదివాసుల జీవనానికి ప్రధాన వనరు. వాటిని పరిరక్షించడానికీ, వారికి హక్కులు కట్టబెట్టడానికీ, గిరిజనసంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికీ, వారి భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి బ్రిటీష్ పాలకులనుంచి నేటి పాలకుల దాకా ప్రత్యేక చట్టాలు తయారు చేస్తున్నప్పటికీ వాటి వల్ల గిరిజనులకు గర్వించదగ్గ స్థాయిలో మేలు జరగడం లేదు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూ బదలాయింపు నిషేధ చట్టం (1/70) ఏజెన్సీలో పనిచేసే వివిధ శాఖల అధికారులకు కల్పతరువుగా మారిందనేది దశాబ్దాల కాలంగా రుజువవుతోంది. భీం మరణం తరువాత, డార్ఫ్ సంస్కరణల ఫలితంగా లక్షలాది ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. కానీ భూములను చూపలేదు. అదేవిధంగా ఆలంపల్లి సంఘటన తరువాత ఆదిలాబాద్ను ఆదర్శ జిల్లాగా ప్రకటించడమే కాకుండా అప్పటి ముఖ్యమంత్రి ‘తెలుగు మాగాణీ సమరాధన పథకం’ ప్రవేశపెట్టి దాదాపు నాలుగు లక్షల ఎకరాల భూములకు పట్టాలిచ్చారు. వాటికీ ఇంత వరకూ భూములు చూపని దయనీయ స్థితి.
కెరమెరి మండల కేంద్రం నుంచి జోడేఘాట్ దాకా 16 కిలోమీటర్ల మట్టిరోడ్డు గత మూడేళ్ళుగా మోక్షానికి నోచుకోలేదు. భీం వర్ధంతి సందర్భంగా గిరిజనుల సమస్యల్ని వల్లెవేయడం, పరిష్కారిస్తామని వాగ్దానం చేయడం తప్ప మరేం జరగడం లేదు.
‘ఆదివాసీ ప్రగతి, అటవీ అభివృద్ధి విడదీయరాని అంశాలు. ఆదివాసుల అభివృద్ధికోసం తయారు చేసే ప్రణాళికలు, కార్యక్రమాలు స్థానిక వనరుల ఆధారంగానే రూపొందాలి. ఆదివాసుల భాగస్వామం లేకుండా వారి అభివృద్ధి కోసం రూపొందించిన ఎలాంటి పథకమైనా నిరుపయోగం. అటవీ యాజమాన్యంలో గిరిజనుడు క్రియాశీలక భాగస్వామి కావడంవల్ల, అటవీసంపదలో వాటాదారుడు కావడం వల్ల మాత్రమే ఆదివాసీ అభ్యున్నతి సాధ్యపడుతుంది’ అని బి.డి శర్మ మార్గనిర్దేశనం చేశారు. దానిని అనుసరించగలిగినప్పుడే కొమురం భీం ఇచ్చిన జల్..జంగల్..జమీన్ నినాదానికీ, చేసిన త్యాగానికీ సార్ధకత చేకూరుతుంది.
source: andhra jyothy, October 26 2007





Injustice to telanganaa… how many times injustice should be proved in telangana to form separate ??